Tuesday 28 July 2015

పర్లీ వైద్యనాథ జ్యోతిర్లింగ దర్శనం

పర్లీ వైద్యనాథ  జ్యోతిర్లింగ దర్శనం
                                                                      - యజ్ఞమూర్తి ద్వారకా నాథ్
“రత్నైకల్పిత మాసనం హిమజలై స్నానంచ దివ్యాంబరం, నానారత్న విభూషితం మృగమదా మోదాంకితం చందనం,
జాతీ చంపక బిల్వ పత్ర రచితం పుష్పంచ ధూపం తధా, దీపం దేవ దయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం.”
అవి నేను పిట్లం (నిజామాబాద్ జిల్లా) ఆంధ్రా బ్యాంక్ బ్రాంచ్ లో మేనేజర్ గా పనిచేస్తున్న రోజులు.   మా అబ్బాయి  సాయి శరణ్ ఢిల్లీలో టీ లో యం టెక్ చేస్తున్నాడుమా అమ్మాయి  వైషూ హైద్రాబాదు లో అర్కిటెక్చర్ చదువుతోంది.  నా అర్థాంగి పద్మజ మా అమ్మాయిని చూసుకుంటూ హైద్రాబాదు లో వుంటోంది.   సాయి శరణ్,  వైషూలకు ఒక వారం రోజులు సెలవులు కావడంతో  ఒక  మూడు రోజులు వుండివెళ్ళడానికి  అంతా పిట్లం  వచ్చారు
ఇంకేం అప్పటికప్పుడు బ్యాంకు లో 3 రోజుల సెలవు తీసుకొని, అక్కడకి దగ్గరలోనే వున్న మహారాష్ట్రలోని పర్లీ వైద్యనాథ జ్యొతిర్లింగాన్ని  దర్శనం చేసుకోవాలని ప్రోగ్రాం వేసేసాము.   కొందరు ప్రజ్వల్యం వైద్యనాథ జ్యొతిర్లింగం ఇది కాదని "దియొఘర్" లో వుందని వాదన చేస్తున్నా, చాలా మంది నమ్మినట్లే మేము కూడా పర్లి వైద్యనాథ ఆలయాన్నే 5 జ్యొతిర్లింగం గా నమ్ముతాముపర్లీకి హైద్రాబాదునుండి రైలుమార్గం కూడా వుంది.  పిట్లం నుండి పర్లీ సుమారు 195 కీ. మీ. దూరంలో వుంది.      తిరుగు ప్రయాణంలో పర్లీ నుండి లాతూర్, బసవకల్యాణ్ ల మీదుగా హైద్రాబాదు కి (సుమారు 375 కీ.మీ. లు) చేరుకోవాలని నిర్ణయించాము.  ఎప్పటిలాగానే ఈసారి కూడా మా ప్రయాణం మా కారులోనే అని నిర్ణయించాము.
03.03.2015 – మంగళవారం – సమయం: సాయంత్రం 6.00 గంటలు –
నేను సాయంత్రం 6.00 ల కల్లా బ్యాంకు నుండి వచ్చాను.  పద్మజ, పిల్లలు అప్పటికే సామాన్లు సర్ది సిద్ధంగా వున్నారు. ఇంకో ఐదు నిముషాల్లో సామాన్లు కార్లో చక్కగా సర్దేసాను. విఘ్నేశ్వరునికీ, ఈశ్వరునికీ నమస్కరించి బయలుదేరాము.  మా కారు పిట్లం గ్రామాన్ని దాటి గుంతలతో నిండిన “కంగ్టి గ్రామం” మీదుగా నిదానంగా సాగింది.  ఆ ప్రదేశమంతా బాగా వెనుకబడి అభివృద్ధికి ఆమడ దూరంలో వుంది. రోడ్డు పరిస్థితి దారుణంగా వుంది.  మొత్తం రోడ్డంతా పోయి మొత్తం గులకరాళ్ళే మిగిలాయి. గత కొన్నేళ్ళుగా అక్కడి ప్రజలు ఆ  రహదారులకే అలవాటుపడి మౌనంగా అలాగే బ్రతుకుతున్నారు. మారుమూల గ్రామాలకు బస్సులు
లేక పోవడంతో ప్రజలందరూ తూఫాన్ వంటి ప్రైవేటు వాహనాలలో క్రిక్కిరిసి ప్రయాణిస్తూ కనిపించారు.  ఆ గులకరాళ్ళపై కారుని జాగ్రత్తగా నడుపుతూ నిదానంగా ముందుకుసాగాము. గోధూళి వేళ కావడంతో రోడ్డు పై ఆవులు మందలు మందలుగా ఎదురు వస్తున్నాయి.

ఇంకో గంటలో మా కారు  కర్ణాటక లో అడుగుపెట్టింది.  అక్కడినుండి రోడ్డు బాగుంది. ఒక్క అర గంటలో మేము “ఔరాద్ నగరాన్ని” (కర్ణాటక)  సమీపించాము. అప్పటికి సమయం రాత్రి గం. 8.00 లు కావస్తోంది. ఔరాద్ లోని పదవ శతాబ్దపు అమరలింగేశ్వర ఆలయం చాల ప్రఖ్యాతమైనది. ఈ ఆలయం వల్లనే ఔరాద్ పట్టణము పదవ శతాబ్దంలో "అమరవాడి" లేద "అవరవాడి" గా వ్యవహరింపబడేది.  ఈ ఆలయాన్ని విక్రమాదిత్యుని కుమారుడైన సోమేశ్వరుదు నిర్మించాడని ఆలయంలోని శిలా శాసనాలు ధృవీకరిస్తున్నాయి. ఆలయంలో రద్దీ అస్సలు లేదు. అమరలింగేశ్వరుని దర్శనానంతరము మా ప్రయాణం ఒక గంట తర్వాత మళ్ళీ మొదలైంది.  కొద్దిసేపట్లోనే మేము మహారాష్ట్ర లో అడుగుపెట్టాము.  ఇంకొక్క గంట ప్రయాణం అనంతరం సుమారు రాత్రి 9.00 గంటల ప్రాంతంలో మా కారు “ఉద్గిర్ నగరం” చేరింది.  రాత్రికి మా బస ఉద్గిర్ నగరంలోని పేద్ద హోటల్ అయిన అజంతా హోటల్ (02385-253838) లో.  హోటల్ సుమారుగా బాగానే వుంది.  హోటల్లోనె వున్న రెస్టారెంట్ లో భోజనం రుచిగా వుంది.
04.03.2015 - బుధవారం - ఉదయం గం 8.00 లు:  ఉద్గిర్ (ఉదయగిరి) నగరంలో చూడతగ్గ ప్రదేశం ఉద్గిర్ కోట. 
ఈ కోటను చేజిక్కించుకునేదుకు హైద్రాబాదు నవాబు మరాఠా వీరులతో 1761 లో పోరాడి, మరాఠా ప్రభువైన సదాశివరవ్ భావ్ చేతిలో ఘోర పరాజయం పాలయ్యాడు. నేటికీ ఈ కోట మరాఠా వీరుల విజయ చరిత్రను ప్రపంచానికి తెలియపరుస్తూ గర్వంగా నిలబడి ఉంది.   అయితే కోట విశేషాలను తెలిపేందుకు గైడ్ల వ్యవస్థ లేదు.  కోట కూడా సరైన నిర్వహణ లేక శిధిలావస్థకు చేరుతోంది.  కోటంతా మరియు కోట గోడలమీద పిచ్చి చెట్లు పెరిగివున్నాయి.  ఈ ఉదయగిరి కోటనుంది ప్రక్కన వున్న గ్రామాలకు సొరంగ మార్గాలున్నాయని స్థానిక ప్రజలు చెప్పుకుంటారు.  కోటలోపల పురాతన ఉదయగిరీశ్వరాలయం వుంది.
ఒక్క గంటలో కోటను వీక్షించి అంబాజోగై కి మా ప్రయాణం మొదలైంది. పద్మజ మాకు అల్పాహారంగా  జాము మరియు పీనట్ బట్టర్ లను పూసిన బ్రెడ్డును ఇచ్చింది. ఉద్గిర్ నుండి అంబాజోగై కి రేణాపూర్ మీదుగా సరిగ్గా 95 కి. మీ. లు.  అంబా జోగై నుండి పర్లీ కి 22 కీ.మీ.లు.
అప్పటికే సమయం ఉదయం గం. 10.00 లు అవుతూండటంతో కారుని ఇంకెక్కడా ఆపకుండా పరిగిత్తించాను.  రోడ్డు అక్కడక్కడా పాడయి వుంది.   చాలా దూర దూరంగా చిన్న చిన్న వూళ్ళు తగులుతున్నాయి.  ఆ రోడ్డుపై ట్రాఫిక్ కూడా చాలా తక్కువగా వుంది.  గత కొన్ని సంవత్సరాలుగా రోడ్డు పాడయిన చోటల్లా ప్యాచ్ లు మటుకే వేయడంవల్ల రోడ్డంతా ఎగుడు దిగుడుగా వుంది.  అందమైన ప్రకృతి ఒడిలో చిన్న చిన్న లోయల మీదుగా మా ప్రయాణం సాగింది. మేము అంబాజోగై చేరేసరికి మధ్యాహ్నం 11.30 గంటలు అయ్యింది.
   అంబాజోగేశ్వరీ దేవి ఈశ్వరునికై తపమాచరించి, మెప్పించి శంకరుని వివాహమాడిన ప్రదేశమే అంబాజోగై గా ప్రసిద్ధి చెందింది.  పార్వతీ దేవి దంతశూరుడనే రాక్షసుడిని వధించిన ప్రదేశం కూడా ఇదే.  ఒకప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వము అంబాజోగై లో క్షయనివారణ ఆసుపత్రిని ఏర్పరిచారు.  నేడు అంబా జోగై విద్యాలయాలతో, పెద్ద పెద్ద హోటళ్ళతో అభివృద్ధి చెందిన టౌను.   ఈ గుడికి కొంకణ తీరం నుండి చాలా మంది భక్తజనం దర్శనానికై వస్తూవుంటారు.  అప్పటికే అపహార్ణవేళ అవుతూండటంతో  మా కారుని నేరుగా అమ్మవారి గుడికి పోనిచ్చాను.  గుడిలో రద్దీ చాలా సామాన్యంగా వుంది. అమ్మవారికి అర్చన అనంతరం గుడి బయట దీపస్తంబం దగ్గర పిల్లలకు కొన్ని ఫోటోలు తీసాము.  మా మద్యాహ్న భోజనం అంబా జోగై లోని "పలక్ వెజ్" లో ముగించాము.  ఉత్తర భారత వంటకాలతో భోజనం రుచిగా, శుచిగా చాలా బాగుంది.  రెస్టారెంట్ బయటవున్న గార్డెన్ లో కొంత సేద తీరాము.  
 కొంత విశ్రాంతి తర్వాత మధ్యాహ్నం గం.2.00 ల ప్రాంతంలో పర్లీ కి బయలుదేరాము.  మార్గమధ్యంలో మాకు రోడ్డుకు ఎడమప్రక్కగా "శ్రీ రామ రక్షా గోశాల" గృహం కనబడితే కారు ఆపాము.   పచ్చటి చెట్ల మధ్య విశాలమైన ప్రాంగణంలో వృద్ధాశ్రమం, గోశాల ఇంకా నిరంతర రామనామ జప సంకీర్తనా మంటపమూ ఇక్కడ నిర్వహిస్తున్నారు.  గోశాలలో సుమారు 40 వరకు గోవులకు ఆశ్రయమిచ్చివున్నారు.
  చక్కటి గోశాల నిర్వహణకు గుర్తుగా గోవులన్నీ ఆరోగ్యంగా పుష్టిగా వున్నాయి.  దూడలు సుమారు 6-7 వరకూ వున్నాయి.  గోసేవలో కొంత సమయం గడిపి, ప్రక్కనే వున్న నిరంతర రామనామ సంకీర్తనా మండపాన్ని దర్శించాము. వృద్ధాశ్రమంలో గల సభ్యులను ఆప్యాయతతో పలకరించి కొన్ని పండ్లను ఇచ్చి పర్లీకి బయలుదేరాము.
సాయంత్రం గం.4.00 ల ప్రాంతంలో పర్లీ చేరుకున్నాము.  “అంబాజోగై” నుండి పర్లీ సరిగ్గా 22 కీ.మీ.లు. కారుని నేరుగా బస్ స్టాండ్ దగ్గరలోని హోటల్ అనసూయా పాలెస్ (Ph. 02446-222377) లోనికి పోనిచ్చాను.  హోటల్ చాల శుభ్రంగా వుంది.  హోటల్ సిబ్బంది కూడా వినయ మర్యాదలతో ప్రవర్తిస్తున్నారు. 
రూం కూడా విశాలంగా 24 గంటలు వేడినీళ్ళ సౌలభ్యంతో, ఒక పేద్ద ఎల్ సీ డీ టీవీ తో వుంది.  అంత పేద్ద రూము అద్దె కూడా అందుబాటులోనే (రూ.700/-) వుంది. 
               భక్త ప్రియాయ, త్రిపురాంతకాయ,  పినాకినీ దుష్ట హరాయ నిత్యం,
               ప్రత్యక్ష లీలాయ మనుష్య లోకే, శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ.
అంతా ఒక్క గంటలో స్నానాలు కావించి తయారు అయిపోయాము.  నల్గురమూ కలిసి వైద్యనాథ దర్శనానికి బయలుదేరాము.  గుడి హోటల్ నుండి సరి గ్గా ఒకటిన్నర కీ. మీ. ల దూరంలో వుంది.  గుళ్ళో రద్దీ పలుచగా వుంది. ఈశ్వరుని జ్యొతిర్లింగ క్షేత్రాలలో పర్లీ వైద్యనాథ ఆలయానికి ఒక ప్రత్యేకత వుంది. ఇక్కడ సాధారణంగా రద్దీ తక్కువగా వుంటుంది.  ఈశ్వర అభిషేకం మనమే స్వయంగా చేసుకోవచ్చు.  పూజారుల వేధెంపులు అస్సలేవుండవు.
ఉదయపు పూట గుడి ఆవరణలోనే స్వామి అభిషేకానికి కావలిసిన ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గంగాజలం, చందనం, తేనె, భస్మం మొదలైన ద్రవ్యాలు నామమాత్రపు ధరకు లభిస్తాయి.  కౌంటరులో అభిషేక రుసుము (రూ.20/-) చెల్లించి స్వయంగా లేదా బ్రాహ్మణుని సాయంతో అభిషేకం చేసుకోవచ్చు.  మంత్రం చెప్పిన బ్రాహ్మణుడు కూడా ఇచ్చిన దానితో తృప్తి పడటం చూసాము.  ఇంకొ విషయం - గుడిలోకి వెళ్ళేటప్పుడు సెక్యూరిటీ తనిఖీలు అస్సలు లేవు.  మేము జేబులో సెల్ ఫోన్ పెట్టుకునే ప్రవేశించాము. 
ఆ రోజు ప్రదోషకాల వేళ మేము స్వయంగా రుద్ర నమక చమకాలతో స్వామిని సేవించుకున్నాము.  గర్భ గుడి విశాలంగా ఒకేసారి 10 మంది ఈశ్వరుని చుట్టూ కూర్చొని అభిషేకించుకునేలా వుంది.  స్వామి గర్భగుడి బయటనే పార్వతీ దేవి దర్శనం లభిస్తుంది.  గుడి బయటి ఆవరణలో విఘ్నేశ్వర దేవాలయం, నారద మహర్షి గుడి, కుబేర ప్రతిష్ఠిత ఈశ్వర లింగం,  త్ర్యంబక లింగం, ఘృష్ణేశ్వర లింగం వంటి ఉప ఆలయాలు వున్నాయి. అనంతరం ఆలయ ఆవరణలోని నారద ముని ఆలయం వద్ద కూర్చున్ని చంద్రశేఖరాష్టకం, లింగాష్టకం, దారిద్ర్యదహన స్తోత్రం, పరమేశ్వర మానసపూజ, శివ తాండవ స్తోత్రం  మొదలైన శ్లోకాలను పఠించాము.  ఆలయ అంతర్ ఆవరణలో రాతితో నిర్మించబడిన ఎత్తైన ఒక దీప స్తంభం అగుపించింది.  గుడి బయటకు రాగానే దేవాలయము వారు నిర్వహిస్తున్న నిత్యాన్నదాన మంటపంలో స్వామి వారి ప్రసాదాన్ని భుజించాము.  ఆ నిత్యాన్నదాన మంటప నిర్వహణ చాలా శ్రద్ధతో శుచిగా నిర్వహిస్తున్నారు.   కోరినన్ని చపాతీలు, రెండు రకాల కూరలు, అన్నం తో కడుపు నిండేలా కొసరి కొసరి వడ్డించారు.   హోటల్ రూముకి చేరేసరికి రాత్రి గం.9.00 లు అయ్యింది.  ప్రయాణ బడలికతో ఇట్టే నిద్ర పట్టేసింది.
05.03.2015 – గురువారం - ఉదయం గం.7.00లు.:
ఉదయాన్నే నిద్ర లేచి అంతా అభ్యంగనాలు ఆచరించి స్వామి అభిషేకానికి ఆలయానికి బయలుదేరాము.  మేము అభిషేక ద్రవ్యాలు కొని గర్భగుడిలోనికి ప్రవేశిస్తూంటే ఒక బ్రాహ్మణుడు అభిషేకం చేయిస్తానని, ఎంత ఇచ్చిన తృప్తిగా తీసుకుంటానని చెప్పాడు.  ఉదయపు అభిషేకం ఆ బ్రాహ్మడి పౌరహిత్యంలో నల్గురమూ కూర్చొని తృప్తిగా చేసుకున్నాము.  బ్రాహ్మణుడు లఘున్యాసక సహితంగా అభిషేకం చేయిస్తూ, మధ్యలో మాకు అభిషేక ద్రవ్యాలు అందించడంలో సహాయపడ్డాడు.  కుటుంబ సమేతంగా జ్యోతిర్లింగానికి చేసుకున్న ఆ అభిషేక సేవ మనస్సుకు ఎంతో ఆనందాన్ని,  తృప్తిని ఇచ్చింది.  గర్భగుడిలోనే ఇంకొంత సేపు స్వామి సేవలో గడిపి బయటకు వచ్చాము.  వైద్యనాథునె సేవను మనము ఎన్ని గంటలైనా ఆనందంగా చేసుకోవచ్చు.  మొత్తం మీద మేము గుళ్ళోనే సుమారు 2 గంటలు గడిపాము.
అప్పటికి సమయం ఉదయం 9.30 గం.లు అవుతోంది.  ఇక వైద్యనాథునినుండి సెలవు తీసుకొని ఆనాటి మా ప్రయాణం ప్రారంభించాము.  ఆనాటి మా ప్రయాణంలో లాతూరు, నీలంగా, బసవకల్యాణ్, జహీరాబాదు ల మీదుగా హైద్రాబాదు (సుమారు 375 కీ.మీ.లు) చేరుకోవడం.  దూరం కొంత పెరిగినా రోడ్డు బాగుంటుందని ఈ మార్గాన్ని ఎంచుకున్నాము.  ముందుగా దారిలో అంబాజొగై లో “పోహా” అల్పాహారం కావించి బయలుదేరాము.  లాతూరు వరకు హేవే మీద ప్రయాణం జోరుగా సాగింది. అక్కడనుండి “నీలంగా టౌను” కి వెళ్ళే రోడ్డెక్కాము.  సన్నటి రోడ్డైనా  చక్కగా వుండటంతో కారుని పరిగెత్తించాను.  నీలంగా టౌన్ సమీపంలో రోజా పూల తోటలు, పుదీనా తోటలు అగుపించడంతో కారుని ఆపి ఆ తోటల్లో ప్రవేశించాము.  దూర ప్రయాణం చేస్తున్నపుడు ఇలా పొలాల్లో, తోటల్లో కొంత విహరిస్తే మనస్సుకూ ఆహ్లాదంగా వుంటుంది, ప్రయాణ బడలిక తీరుతుంది, కారుకి కూడా కొంత రెస్ట్ దొరుకుతుంది తోటల యజమాని కుటుంబంతో ఆత్మీయంగా కొంత సేపు ముచ్చటించామువారు ఇచ్చిన పుదీనా ఆకును, రోజా పూలను తీసుకొని మళ్ళీ మా ప్రయాణం ప్రారంభించాము.
 
మధ్యాహ్న భోజన సమయానికి కర్ణాటక రాష్ట్రం లోని బసవ కళ్యాణ్ నగరాన్ని చేరుకున్నాము. భోజనం బసవ కళ్యాణ్ లోని గాయత్రీ రెస్టారెంట్ లో కావించాముఉత్తర భారత వంటలు చక్కటి  రుచితో అద్భుతంగా వున్నాయి.  కడుపు నిండా తిన్న తర్వాత కొంత సేదతీరి, 108 అడుగుల బసవన్న విగ్రహాన్ని దర్సించున్నాము.  సమయాభావం వల్ల బసవకళ్యాణ్ కోటను, అక్కమ్మ గుహలను దర్శించలేకపోయాము.
  కొంత ముందుకు సాగేసరికి ద్రాక్షా పళ్ళ తోటలు అగుపించడంతో కారుని వాటి ప్రక్కగా నిలిపి తోటల్లోకి ప్రవేశించాము.   ద్రాక్షా పళ్ళు పక్వానికొచ్చి గుత్తులు గుత్తులుగా కనులవిందు చేస్తున్నాయి పండ్ల తోటలో పద్మజా వైషూలకు కొన్ని ఫోటోలు తీసాముకొన్ని ద్రాక్షాపండ్లను కొన్న తర్వాత మళ్ళీ మా ప్రయాణం మొదలైంది.
అంతలో మా కారు బాంబే-హైద్రాబాద్ జాతీయ రహదారిని ఎక్కింది.  బాంబే - హైద్రాబాదు జాతీయ రహదారి రెండు వరుసల రోడ్డు విస్తరణ పనులు వేగంగా సాగుతున్నాయి. అవి గమనించుకుంటూ పిల్లల నవ్వులతో కేరింతలతో మా కారు హైద్రాబాదు వైపు దూసుకుపోతోంది.